కాంగ్రెసు ప్రభుత్వాన్ని సానంపండి: ప్రజలకు వైయస్ జగన్ పిలువు
చంద్రబాబు ఐదేళ్లలో వంద శాతం కరెంట్ చార్జీలు పెంచారని, వంటగ్యాస్ ధరలు కూడా పెంచారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనిషన్నవాడు ఒకే రకంగా ఉండాలని, అమ్మకం పన్నును చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా పెంచాడని, ఇప్పుడు అమ్మకం పన్ను తగ్గించాలని అంటున్నారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించి, అధికారంలో లేనప్పుడు మరో రకంగా మాట్లాడడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. కృష్ణా - గోదావరి బేసిన గ్యాస్ విషయంలో చంద్రబాబు మోసం చేశారని, బిడ్డింగులో పాలుపంచుకోకపోవడమే చంద్రబాబు చేసిన అన్యాయమని ఆయన అన్నారు. బిడ్డింగులో పాల్గొని ఉంటే వంద రూపాయలకో వంద యాభై రూపాయలకో గ్యాస్ వచ్చి ఉండేదని ఆయన అన్నారు.
కూరగాయల ధరలు మండిపోతున్నాయని, కూరగాయలను తాకితే షాక్ తగులుతోందని వైయస్ జగన్ అన్నారు. సంచులతో డబ్బులు తీసుకుని వెళ్తే పిడికిట్లో కూరగాయలు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఆరు నెలల్లో ఏడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు. ఇతర దేశాల్లో మన దేశంలో కన్నా పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని అంటూ ఆయన లెక్కలు చెప్పారు. చమురు కంపెనీల పేరు చెప్పి పెట్రోల్ ధరలు పెంచితే పేదవాడు ఎటు పోవాలని ఆయన అడిగారు.
వైయస్సార్ మరణించిన తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం కరెంట్ చార్జీలు, ఆర్టీసి చార్జీలు పెంచిందని ఆయన విమర్శించారు. గ్యాస్ ధర 300 రూపాయల నుంచి 343 రూపాయలకు పెంచిందని ఆయన అన్నారు. మునుపటి చంద్రబాబు పాలన, ఇప్పటి కాంగ్రెసు పాలన దొందూ దొందే, విశ్వసనీయత, విలువలపై ఏ ఒక్కరికీ పట్టడం లేదని ఆయన అన్నారు.