హత్య కేసులో ఇరుక్కుంటే నేనే కాపాడా: వైయస్ జగన్పై కిరణ్ కుమార్
"నా సమర్ధత నిరూపించుకొని వైఎస్కు అండగా నిలిచా. నేను ఒక్కడినే కాదు. వైఎస్తో పాటు మరో వంద మంది నాయకులం కలిసి పార్టీ అధికారంలో లేనప్పుడు ముందుకు సాగాం. ఆయనతో పాటు కష్టాలు అనుభవించాం. మరి రాజకీయ వారసత్వం మా వంద మందికీ వస్తుందా? వైఎస్ కుటుంబానికి వస్తుందా?" అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. "వైఎస్ను కాపాడుకోవడానికి టీడీపీ హయాంలో 90 రోజులు దీక్ష చేశాం. ఒక విధంగా వైఎస్ను అందలమెక్కించడానికి ఇటుక ఇటుక పేర్చాం. వైఎస్ ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో నేను కూడా వెళ్లాల్సింది. కానీ ఆయన అప్పటికి పావుగంట ముందే నాకు వేరే పని అప్పగించారు" అన్నారు.
"వైఎస్పై ఈగ వాలితే దాన్ని చంపేవరకూ వదలని శత్రుత్వం టీడీపీపై పెంచుకున్నా. 1978లో వైఎస్సార్ రాజకీయ ప్రవేశం చేశారు. తొలుత కాంగ్రెస్-ఆర్లో చేరారు. ఆ తరువాత కాంగ్రెస్-ఐకి మారారు. అప్పటికే నా తండ్రి కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఇన్చార్జి మంత్రిగా రెండేళ్లు పనిచేశారు. ఐదేళ్లలో వైఎస్ చేసిన అభివృద్ధి అంతా సోనియా సూచనలతోనే జరిగింది. కాంగ్రెస్ వల్ల, గాంధీ కుటుంబం వల్ల వైఎస్సార్ పెద్ద నేత అయ్యారు'' అని సీఎం చెప్పారు. అధికారం కోసం పార్టీలు మారడం, కులం, మతం మార్చుకోవడం మంచిది కాదన్నారు. "అందరికీ చెప్పుకోవడానికి అడ్రస్ ఉందంటే ఎక్కడ నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే. దాన్ని మర్చిపోతే పూర్తిగా ఎవరికీ అడ్రస్ ఉండదు'' అంటూ తన ప్రసంగం ముగించారు.