ఆంధ్రులు చేసే బిర్యానీ పేడలా ఉంటుంది: కె. చంద్రశేఖర రావు
సోమవారం హైదరాబాద్ నగరంలోని అజాంపురలో ముస్లిం నేత నాసిర్ఖాన్ కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం చారిత్రక నగరమని, నిజాం నవాబుల కాలం నుంచి దీన్ని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఆంధ్రతో విలీనమయ్యేనాటికి నాటి హైదరాబాద్ రాష్ట్రం దేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రంగా, మిగులు బడ్జెట్తో ఉండేదన్నారు. కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్రరాష్ట్రం రూ.20 కోట్ల లోటుబడ్జెట్తో ఉండేదని వివరించారు. అలాంటిది సమైక్యరాష్ట్రంగా మారిన తర్వాత ఆంధ్రవారు తెలంగాణ ప్రాంత నిధులు, నీళ్లు, ఉద్యోగాలను, బొగ్గును తరలించుకువెళ్లారన్నారు. సమైక్యరాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయినవారిలో ముస్లింలు ముందువరుసలో ఉన్నారని, ఆంధ్రప్రాంతం నుంచి ముఖ్యమంత్రులైనవారికి ముస్లింల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. వీరి అభివృద్ధికి ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు. ఇక తెలంగాణ ప్రజలు మేల్కోనాల్సిన సమయం వచ్చిందని, ఐక్యంగా ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొందామని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ముస్లిం మైనార్టీ వర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని, వారికి 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని పునరుద్ఘాటించారు. మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి పదవితోపాటు 2-3 మంత్రి పదవులు కూడా ఇస్తామన్నారు. వారికి రూ.వెయ్యికోట్ల బడ్జెట్ను కేటాయిస్తామన్నారు. తెలుగుతోపాటు ఉర్దూను అధికార భాషగా గుర్తిస్తామన్నారు.