జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. అలాగే తాజాగా పంజాబ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో నెలకున్న ఎండల తీవ్రత, హీట్ వేవ్ తరహా పరిస్థితుల కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ తాజాగా విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ నెల మొత్తం మూసివేయనున్నారు. విద్యార్థులు జూలైలో పరిస్థితులను బట్టి తిరిగి తరగతులకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా పంజాబ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది.
ముఖ్యంగా జూన్ నెలలోనూ అక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ నమోదవుతుంటాయి. అలాగే బటిండా, అమృత్ సర్, లుథియానా వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 47 డిగ్రీల వరకూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం వీచే వేడి గాలులతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలలకు రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది.
దాంతో పంజాబ్ ప్రభుత్వం జూన్ 30 వరకు వేసవి సెలవులను పొడిగించింది. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంజాబ్ విద్యాశాఖ పేర్కొంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక లో కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జూన్ 4 నుంచే పాఠశాలలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో ఈనెల 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈనెల 12 కు బదులుగా 15 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. శని, ఆదివారాల సెలవుల నేపథ్యంలో విద్యాశాఖ స్కూళ్ల రీఓపెనింగ్ తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications