Amaravati Seed Access Road: ఆ 'S' మలుపు కథేంటి ? తేల్చేసిన సర్కార్..!
అమరావతి రాజధానిని మిగతా ప్రాంతాలతో కలిపే విధంగా ప్రభుత్వం నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు (Amaravati Seed Access Road)లో ఒక చోట ఎస్ ఆకారంలో ఓ టర్న్ వచ్చింది. దీన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్మించిందా లేక రోడ్డు నిర్మాణంలో వేరే మార్గం లేక అలా ఏర్పాటు చేశారా అన్న అనుమానాలు వచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అంతా ఎలాంటి మలుపులు లేకుండా ఉన్నప్పటికీ ఒకే ఒక్క చోట ఈ ఎస్ టర్న్ రావడంతో అక్కడ ఉన్న స్థలం కోసమే ఇలా మలుపు తిప్పారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం (AP Govt) ఇవాళ వివరణ ఇచ్చింది.
రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిలోని 'S' ఆకారపు మలుపుపై ప్రజల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ అధికారిక వివరణను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్-3లో భాగంగా విజయవాడ-చెన్నై జాతీయ రహదారి (NH-16)ను మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ప్రధాన రహదారి కారిడార్ నిర్మించాల్సి ఉందని, భవిష్యత్లో చేపట్టే ఈ కారిడార్ నిర్మాణానికి అనుగుణంగా, అవసరమైన భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానాలు, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది.

రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు, కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యంగా సీడ్ యాక్సెస్ రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. అందువల్ల సీడ్ యాక్సెస్ రహదారిలోని 'S' ఆకారపు మలుపులను భవిష్యత్ రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలని కోరింది. వీటిపై వస్తున్న అసత్య ప్రచారాలు, అపోహలకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేసింది. ప్రజలు ఈ అంశంపై వాస్తవాలను గమనించి, అసత్య ప్రచారాలను నమ్మకుండా, అపోహలకు గురికావద్దని ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసింది.














Click it and Unblock the Notifications