మల్లిఖార్జున ఖర్గే సభా స్ధలి శుద్ధీకరణ-కాంగ్రెస్ బాస్ కు అవమానం..! ఇరుకునపడ్డ బీజేపీ..!
కాంగ్రెస్అధ్యక్షుడు, దళిత నేత, రాజ్యసభలో విపక్ష నేతగా కూడా ఉన్న మల్లిఖార్జున ఖర్గేకు (Mallikarjun Kharge)కు ఉత్తరాఖండ్ లో తాజాగా నిర్వహించిన ఓ ర్యాలీ తర్వాత తీరని అవమానం జరిగింది. ఆయన ర్యాలీ నిర్వహించిన ప్రదేశాన్ని శ్రీరామ్ సేన శుద్ధీకరణ చేయడం వివాదాస్పదమైంది. దీనిపై ఆయన ఇవాళ నేరుగా రాజ్యసభలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో ఇరుకునపడ్డ ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించింది.
ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో ఉన్న రామ్లీలా మైదానంలో తాను ప్రసంగించిన తర్వాత అక్కడ జరిగిన శుద్ధి కార్యక్రమంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ఈ దేశంలో దళితులకు చోటు లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ దేశంలో దళితులకు చోటు లేదని తాము ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నామని గుర్తుచేశారు. బీజేపీ మతం పేరుతో ప్రజలందరినీ విభజిస్తోందని, అక్కడ శుద్ధి చేయాల్సిన అవసరం ఏముందని శ్రీరామ్ సేన ను ఉద్దేశించి రాజ్యసభలో ఖర్గే ప్రశ్నించారు. రామ్లీలా మైదానం అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభల కోసం ఉపయోగించే వేదిక అని, కానీ వారు చేసిన పని మొదటగా హిందూ మతానికే విరుద్ధమని ఖర్గే తెలిపారు. రెండవది వారు దేశాన్ని విభజించడానికి, కులాల మధ్య ఘర్షణలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

తాను హల్ద్వానిలోని రామ్లీలా మైదాన్లో బహిరంగ ప్రసంగం చేశానని, అక్కడ లక్షలాది మంది ప్రజలు ఉన్నారని, ఆ సమయంలో తాను ఏ వర్గం లేదా మతం పేరునూ ప్రస్తావించలేదని ఖర్గే తెలిపారు. కేవలం ప్రభుత్వం గురించి మాత్రమే మాట్లాడానన్నారు. కానీ తన ప్రసంగం తర్వాత ఆ వేదికను శుద్ధి చేయడానికి బీజేపీకి చెందిన వారు అక్కడ ఒక హవన్ను నిర్వహించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదేనా పద్ధతి? మీరు రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతున్నారు? నేను ప్రతిపక్ష నాయకుడిని అని ఖర్గే ప్రభుత్వానికి గుర్తుచేశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. అందులో బీజేపీ సభ్యుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అలాగే దీనిపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.














Click it and Unblock the Notifications