చిరంజీవి రాజకీయాల్లో నెంబర్ వన్ కాగలరా, కాంగ్రెసు కానిస్తుందా?
పార్టీని పటిష్టం చేసి, వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలని ఆయన భావించారు. అందుకు మరోసారి ఆయన సోదరుడు నాగబాబు రంగంలోకి కూడా దిగారు. అయితే, అకస్మాత్తుగా ఆయన వెనక్కి తగ్గారు. చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ తనపై వచ్చిన విమర్శలతో కొంత కాలం రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలు తీయడంలో మునిగిపోయారు. మళ్లీ ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించడానికి ముందుకు వచ్చారు. దాంతో ప్రజారాజ్యం పార్టీ ప్రణాళిక కాంగ్రెసు దిశగా సాగుతూ వచ్చింది. కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చిరంజీవి సిద్ధపడ్డారు. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో చిరంజీవి అవసరం కాంగ్రెసుకు కూడా ఏర్పడింది. దీంతో చిరంజీవితో స్నేహానికి కాంగ్రెసు అధిష్టానం సీరియస్గానే ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు ఓ వారంలోగా ఓ కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.
చిరంజీవి నెంబర్ వన్ స్థానం కోసం చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెసు ఊతం లభించే అవకాశాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. బహుశా, వచ్చే ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తారని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ మూడేళ్లలోగా పరిస్థితులు ఎటు దారి తీస్తాయో కూడా చెప్పలేం. తెలంగాణ డిమాండ్ రోజు రోజుకూ ఊపందుకుంటోంది. తెలంగాణ కాంగ్రెసు నాయకులు చిరంజీవితో చెలిమిని వ్యతిరేకిస్తున్నారు. చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవడం తప్ప మరో మార్గం లేదని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. కాంగ్రెసులో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు తెర మీదికి వస్తారో, ఎవరు తెరమరగువుతారో చెప్పడం కష్టం. ఈ స్థితిలో చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినా నెంబర్ వన్ స్థానం కోసం తీవ్రంగానే కష్టపడాల్సి ఉంటుంది.