జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై చర్యలకు కాంగ్రెసు హైకమాండ్ రెడీ
వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం లేని, కరుడుగట్టిన జగన్ విధేయులను లక్ష్యంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలి విడత ఐదారు మందిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కొండా సురేఖ, బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాబూరావు, బాలరాజు, శివప్రసాద్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, గర్నాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రావులపై కాంగ్రెసు దృష్టి పెట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సమైక్యవాది అయిన జగన్ను బలపరుస్తుండడం వల్ల వచ్చే ఎన్నికల్లో సురేఖ గెలుపు సాధ్యం కాదని కాంగ్రెసు అధిష్టానం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ కలయిక వల్ల బాలినేని, పిల్లి సుభాష్ చంద్రబోస్లకు కూడా విజయం నల్లేరు మీద బండి నడక కాదని అంటున్నారు. బాబూరావు కూడా గెలవకపోవచ్చునని అంటున్నారు. అయితే, గిరిజనుడైన బాలరాజుపై చర్యలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.