వైయస్ జగన్ జట్టు సత్తా ఎంత, ఇతర పార్టీలను ఎదుర్కోగలదా?
ప్రస్తుతం జగన్ వెంట ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులే ఉన్నారు. వీరే వైయస్ జగన్ పార్టీలో ప్రథమ శ్రేణి నాయకులు అవుతున్నారు. ఒక రకంగా వీరికి వైయస్ జగన్ ద్వారా మంచి అవకాశం లభించినట్లే. మాజీ మంత్రులు, మాజీ శాససభ్యులు మాత్రం మరింత మంది వచ్చే అవకాశాలు ఉండవచ్చు. కానీ అది వైయస్ జగన్కు పెద్దగా ఉపయోగపడేది కాదు. పైగా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో సీమాంధ్రలో పరిస్థితి మారిపోయింది. ఇది వైయస్ జగన్కు ఇబ్బందికరమే. కోస్తాంధ్రలోని కాపులు దీంతో వైయస్ జగన్ వెంట నడిస్తారా అనేది అనుమానమే.
కోస్తాంధ్ర సమన్వయకర్తగా నియమితులైన అంబటి రాంబాబు గానీ రాయలసీమకు సమన్వయకర్తగా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి గానీ తమ సత్తాతో పార్టీకి బలం చేకూర్చగలుగుతారనేది అనుమానంగానే ఉంది. తెలంగాణలో గోనె ప్రకాశ రావు, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, రెహ్మాన్ ఆయా జిల్లాల్లో బలాన్ని సమీకరించగలరా అనేది కూడా సందేహమే. దాదాపుగా అన్ని జిల్లాల పరిస్థితి అదే విధంగా ఉంది. ఈ నాయకుల వెనక నడిచేందుకు సీనియర్లు ఇష్టపడకపోవచ్చు. తాము జగన్ పార్టీలోకి వస్తే తమకన్నా ఎంతో జూనియర్లు, బలం లేనివారు అయిన నాయకుల కింద పనిచేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతో సీనియర్లు, సమర్థులు వెనక్కి తగ్గవచ్చు. అయితే, జగన్ వర్గం మాత్రం వైయస్సార్పై ప్రజల్లో ఉన్న అభిమానమే తమను గట్టెక్కిస్తుందని నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ఏమైనా, జగన్ జట్టుకు అంతా సత్తా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇది జగన్కు తీవ్రమైన ఇబ్బందులే తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు.