గవర్నర్ చెప్పరాని మాటన్నారు, చర్యలుండవా: హరీష్ రావు
తెలంగాణ ప్రజలు న్యాయం చేయాలని అడుగుతున్నారని, కాంగ్రెసు తన మాట నిలబెట్టుకోవడం లేదని అడుగుతున్నారని, ఈ స్థితిలో తెలంగాణ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. అయినా తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరని ఆయన చెప్పారు. గవర్నర్ తెలంగాణ వ్యతిరేకి అని, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదవ అధ్యాయం గవర్నర్ ఆలోచనల మేరకే రూపుదిద్దుకుందని, అందుకే బయటపెట్టడం లేదని ఆయన అన్నారు.
గవర్నర్ను రీకాల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ను తెలంగాణలో అడ్డుకుంటామని, నరసింహన్ను వెనక్కి పంపేవరకు వదిలేది లేదని ఆయన అన్నారు. తమను నోటితో చెప్పలేని మాటన్న గవర్నర్పై కేసు ఎందుకు పెట్టరని ఆయన అడిగారు. గవర్నర్ తన పరిధి దాటి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
గవర్నర్ విశ్వవిద్యాలయాలను పోలీసు క్యాంపులుగా మార్చారని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను అణచేసేందుకు తెలంగాణ గొంతు నొక్కుతున్నారని ఆయన అన్నారు. కేసులు పెట్టినా, సస్పెండ్ చేసినా తమ పోరాటం ఆగబోదని ఆయన అన్నారు. ప్రభుత్వం దొంగలా పారిపోయిందని ఆయన అన్నారు.