మార్చి 10వ తేదీన హైదరాబాదు దిగ్బంధం: కె చంద్రశేఖర రావు
తాము తెలంగాణ కోసం ఆందోళన చేస్తే లోకసభలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ బొమ్మలాగా కూర్చున్నారని, ఒక్క మాట చెప్పాలని సుష్మా స్వరాజ్ అడిగినా బల్బు వెలగలేదని, అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుందని, ఆ స్విచ్ ఎక్కడ ఉందో తమకు తెలుసునని, అందుకు తాము ఏం చేయాలో తెలుసునని ఆయన అన్నారు. కూకట్పల్లి శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ విషయంలో అసెంబ్లీ ఆవరణలో ఏం జరిగిందో తెలియదు గానీ మల్లేష్ ఆగ్రహం పట్టలేక ఓ దెబ్బ వేశాడని, దానికి జైల్లో ఉన్నాడని, ఇప్పుడు మలేష్ ఫార్ములా చెలామణిలోకి వచ్చిందని ఆయన అన్నారు.
తాను ఏది మాట్లాడినా వివాదం చేస్తున్నారని, తాను సీమాంధ్రులపై ఉమ్మేస్తానని అన్నట్లు మీడియా చిత్రీకరించిందని, తాను అన్న మాటల వెనకా ముందులు తీసేసి మీడియా వివాదాలు సృష్టిస్తోందని, అయినా తానేమీ బాధపడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలు చేయడానికి ముందుకు రాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. సిగ్గూ శరం లేదని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంక్రిమెంట్లు ఇస్తామని ఆయన చెప్పారు.