చిరంజీవి తెలంగాణ రాష్ట్రం ఇస్తే వ్యతిరేకిస్తారా, మరేం చేస్తారు?
తాను సమైక్యవాదినే అని ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా చిరంజీవి చెప్పారు. అయితే, కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు. ఈ రకంగా చూస్తే తెరాస చెప్పినట్లు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడం తెలంగాణకు అనుకూలమే. కాంగ్రెసు అధిష్టానం ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోదని చిరంజీవి గట్టిగా నమ్ముతున్నారా అనేది సందేహం.
ఆలా నిర్ణయం తీసుకోదని భావించే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, చిరంజీవి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో తీర్మానం పెడితే సమర్థిస్తామని కూడా చెప్పారు. కానీ, డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన వెలువడగానే ప్లేటు ఫిరాయించారు.
చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ముందుకు తెస్తే, చిరంజీవి ఏకంగా సమైక్యవాదాన్ని పుచ్చుకుని సీమాంధ్రలో పర్యటనలు చేశారు. ఒకవేళ కాంగ్రెసు అధిష్టానం మరోసారి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే విలీనం ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటారా అనేది తెలియడం లేదు. ఏప్రిల్లో ఓ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెసులో అధికారికంగా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈలోగా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం వెలువరించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.