బడ్జెట్లో పేదవారికి అన్యాయం: టిడిపి అధినేత చంద్రబాబు
వ్యవసాయంపై కర్ణాటక ప్రత్యేక బడ్జెట్ పెట్టిందని, అన్ని రాష్ట్రాలు, కేంద్రం కూడా ఆ దిశలో ప్రత్యేక బడ్జెట్ పెట్టాలన్నారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంపై ఆసక్తి కనబర్చలేదన్నారు. కేంద్రం చర్యల వల్ల మైక్రో ఫైనాన్స్ ఆగడాలు మరికొంత కాలం కొనసాగే అవకాశముందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు వచ్చినట్లుగా చెబుతోందని అయితే దానివల్ల లాభమెవరికో తెలియదన్నారు. పన్నుల వసూళ్లలో పారదర్శకత లేదన్నారు. వ్యవసాయానికి కేటాయించిన రుణాలు సరిపోవన్నారు. బడ్జెట్లో పేదవాడికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలుగుదేశం ప్రవేశ పెడతామని చెప్పిన నగదు బదిలీ పథకంపై కేంద్రం ఇప్పుడు ఆలోచిస్తుందని చెప్పారు. దేశంలో నగదు బదిలీ సక్రమంగా ఉంటే పేదవారికి అన్యాయం జరగకుండా ఉంటుందన్నారు.
ధరలు ఎలా తగ్గిస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. చేతివృత్తులు, కులవృత్తుల ప్రస్తావన లేదన్నారు. పేదలకు ఆర్థిక పుష్టి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో నగదు బదిలీ పథకం అమలవుతోందని ఇది శుభపరిణామం అన్నారు. అవినీతిపై ఐదంచెల వ్యూహం అంటున్నారని, అయితే కానీ 2జి స్పెక్ట్రం, కామన్వెల్తు ఇంత భారీగా అవినీతి జరిగినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో ఉన్న పెద్దలు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారన్నారు. అవినీతిని అడ్డుకోకపోతే భారతదేశం అభివృద్ధిలో వెనుకబడుతుందన్నారు. పెరిగిన ధరల దృష్ట్యా అంగన్ వాడీ వర్కర్లకు మరికొంత జీతాల పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పవర్ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఓ పరిష్కారం లేకుండా ముందుకు వెళుతుందన్నారు. ప్రజలు ఆందోళనను పరిగణలోకి తీసుకొని వారి సమస్యను పరిష్కరించే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.