ముగిసిన ట్రంప్ డెడ్ లైన్..! పెట్రో ధరల పెంపు తప్పదా ?
దాదాపు నాలుగేళ్ల తర్వాత మే 15న భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol and Diesel Prices) పెరిగాయి. రష్యా చమురు (Russian Oil) కొనుగోళ్లపై అమెరికా విధించిన కీలక ఆంక్షల మినహాయింపు ఇప్పుడు గడువు ముగియడంతో.. మరోసారి చమురు ధరలు మరింత పెరగవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆసియాలోని ఘర్షణలు, కీలక చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి చుట్టూ సరఫరా అంతరాయాల భయాలతో ప్రపంచ ముడి చమురు ధరలు ఇప్పటికే గణనీయంగా పెరుగుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
గత శనివారం ట్రంప్ ప్రభుత్వం రష్యా సముద్ర చమురుపై ఆంక్షల మినహాయింపును ఒక నెల పొడిగింపు తర్వాత రద్దు చేసింది. దీనివల్ల గతంలో భారత్ సహా అనేక దేశాలు ఆంక్షల ప్రమాదాలు లేకుండా రష్యా ముడి చమురును కొనుగోలు చేయగలిగాయి. గత రెండేళ్లుగా భారత్ రాయితీ కలిగిన రష్యన్ చమురుపై ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు ఈ మినహాయింపు రద్దుతో భారత రిఫైనరీలు ఇప్పుడు రష్యన్ చమురు కొనుగోళ్లలో ఆంక్షల ముప్పు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్ కు రష్యా ముడి చమురు దిగుమతులు ఇటీవల పెరిగాయి. మే నెలలో రోజుకు దాదాపు 2.3 మిలియన్ బ్యారెళ్లు, మే 14 నాటికి 1.88 మిలియన్ బ్యారెళ్ల దిగుమతులు అంచనా వేశారు. ఈ రాయితీ అస్థిర ప్రపంచ ఇంధన మార్కెట్లలో భారత్ కు ఉపయోగపడింది.

ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రయత్నాలు నిలిచిపోవడం, యూఏఈ అణు విద్యుత్ ప్లాంట్పై దాడి, ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యల వార్తలతో ఇవాళ చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.81% పెరిగి బ్యారెల్ 111.24 డాలర్లకు చేరగా, WTI క్రూడ్ 2.15% పెరిగి 107.69 డాలర్లకు చేరింది. ఇప్పటికే చమురు కంపెనీలు పెరుగుతున్న ముడి చమురు వ్యయాలను భరించలేక ఈ నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు ₹3 పెంచాయి. ఇప్పుడు ముడి చమురు ధరలు పెరుగుతూ పోతే మరోసారి పెంచక తప్పని పరిస్దితి రానుంది. పశ్చిమాసియా పరిస్ధితులు మారకుండా ముడి ధరలు పెరుగుతూ ఉంటే.. నష్టాల భర్తీకి మొత్తంగా లీటర్కు సుమారు ₹10 పెరుగుదల అవసరమని తెలుస్తోంది.














Click it and Unblock the Notifications