తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంటు: సభ వాయిదా
అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇంటిలో సమావేశమయ్యారు. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. అనంతరం నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకు సమావేశాలను స్థంభింపజేసేందుకు తెలంగాణ ఎంపీలం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో తమ తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామని చెప్పారు. ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు తెలంగాణ ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
కావూరి అవినీతి అందరికీ తెలుసునని వారు అన్నారు. కావూరి గురించి ఇప్పుడు మాట్లాడల్సిన అవసరం లేదని ఆయన గురించి ముందు ముందు బయట పెడతామన్నారు. కావూరికి తెలంగాణ ప్రజల మనోభావాలు తెలియజేయడానికే లాయర్లు ఆయన ఇంటి వద్ద ఆందోళన చేశారని, కానీ ఆయన తెలంగాణ ప్రజాప్రతినిధులపై అర్థరహిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ కోసం అవసరమైతే రాజీనామాలకు కూడా తాము సిద్ధమని వారు ప్రకటించారు.