తెలంగాణ అడ్డుకోవడానికి చంద్రబాబుతో కాంగ్రెసు నేతల మంతనాలు: గండ్ర
ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుకు ఇక్కడి ప్రజల మనోభావాలు తెలియజేసేందుకే తెలంగాణ లాయర్లు ఆయన ఇంటికి వెళ్లారన్నారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడిన విషయాలు మాత్రం తెలంగాణ ప్రజలన మనోభావాలను కించపర్చే విధంగా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. దేశంలో 500 రాష్ట్రాలు, జిల్లాకో రాష్ట్రం అయినా తనకు అభ్యంతరం లేదని వ్యంగంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాపై ప్రశ్నించడాన్ని గండ్ర తప్పు పట్టారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు కావూరి వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణపై ఎప్పుడు ఏం చేయాలో తెలుసన్నారు. అధిష్టానాన్ని ఒప్పించి తప్పకుండా తెలంగాణ తీసుకు వస్తామని చెప్పారు. ఆయన సలహాలు మాకు అవసరం లేదన్నారు. తెలంగాణ ఏ పద్ధతిలో తీసుకు రావాలో తెలుసున్నారు.
తెలంగాణ సాధన కోసం ఏం చేయాలో అందరం భేటీ అయి నిర్ణయించుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎవరిపైనా దాడి చేయాల్సిన అవసరం లేదన్నారు. గాంధేయ పద్ధతిలో పోరాడి తెలంగాను సాధించుకుంటామని చెప్పారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తెలంగాణ ఆకాంక్షను అర్థం చేసుకోవాలని కోరారు. మా ప్రజలు తెలంగాణను కోరుకుంటున్నారన్నారు. బుధవారం కావూరి వ్యాఖ్యల ద్వారా, నేడు టిడిపి చర్యల ద్వారా సీమాంధ్ర నేతల నైజం, చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు తీసుకునే నిర్ణయానికి వారే బాధ్యులు అన్నారు.