తెలంగాణవాడు కాబట్టి ఏమీ తెలియదు: రమణ దీక్షితులు
తరతరాలుగు శ్రీవారి కైంకర్యం సేవలో ఉన్న తమ నాలుగు కుటుంబాలను ఏమాత్రం సంప్రతించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. తమకు శ్రీవారి ఆచార వ్యవహారాలు పుట్టుకతో వచ్చిన విద్య అన్నారు. తిరుమలకు మార్గం లేని రోజులనుంచి మిరాశీ వారు కైంకర్యం చేస్తున్నారన్నారు.ఆగమ సలహాదారు భట్టాచార్య చెప్పినట్లుగా చేసి ఆ తర్వాత తప్పును సరిదిద్దుకోలేక పోతుందన్నారు. వసంత మండపంలో శ్రీవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలను మాత్రమే నిర్వహించాల్సి ఉండగా వేద పారాయణం చేశారన్నారు. ఆలయంలో వైఖానస సంప్రదాయం ఉంది, అయితే వైఖానసంలో వేదాలతో హోమాలు చేయకూడదన్నారు. అలాగే మరుగుదొడ్ల పక్కన వైభవోత్సవ మండపం నిర్మించారని, అక్కడ శ్రీవారి ఉత్సవమూర్తులను నిలిపి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారని, ఇది సరికాదని తాము చెప్పినప్పటికీ అధికారవర్గం వినటం లేదన్నారు.
దేవస్థానానికి అనుకూలంగా సలహాలు ఇచ్చే వారినే ఆగమ సలహాదారులుగా నియమించుకోంటుందని ఆరోపించారు. వేయికాళ్ల మండపం కొట్టకూడదని చెప్పినా కొట్టేశారని చెప్పారు. ఆళయం వెలుపల భద్రతా సిబ్బందిని మకర తోరణం, శంఖుచక్రాల మధ్య కూర్చోబెట్టి వారిని దేవుళ్లలాగా చూపిస్తున్నారని, ఇది సరికాదన్నారు. తితిదే పాలనా వ్యవహారాల్లో మేం జోక్యం చేసుకోమని, అలాగే శ్రీవారి ఉత్సవాలు, నిత్య పూజల విషయంలో మాత్రం మిరాశీ అర్చకులు చెప్పినట్లుగా జరగాలని వారు డిమాండ్ చేశారు. కాగా మహామణి మండప నిర్మాణం వల్ల ఆలయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని హైకోర్టు తెలిపిందని, దాని మేరకే కడుతున్నామని తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది.