మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత అర్జున్ సింగ్ కన్నుమూత

అర్జున్ సింగ్ 1930 నవంబర్ 5న మధ్యప్రదేశ్లోని చుర్హాత్లో జన్మించారు. తండ్రి రావు శివ బహదూర్ సింగ్, తల్లి మోహినీదేవీ. అలహాబాద్, ఆగ్రా విశ్వవిద్యాలయాల నుంచి బీఏ, న్యాయ పట్టాలు అందుకున్నారు. 1957లో అర్జున్ మధ్యప్రదేశ్ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1980లో తొలిసారి మధ్యప్రదేశ్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. 1985లోనూ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆ మర్నాడే పంజాబ్ గవర్నర్గా నియమితులయ్యారు. అక్కడ రాజీవ్-లోంగోవాల్ ఒప్పందం ఖరారు కావటంలో కీలక పాత్ర పోషించారు.
80ల్లో కేంద్ర వాణిజ్య, కమ్యూనికేషన్ మంత్రిగా పనిచేశారు. తిరిగి 1988 ఫిబ్రవరిలో మూడోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 90ల్లో పీవీ నరసింహారావు మంత్రివర్గంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో కాంగ్రెస్కు వీడ్కోలు చెప్పారు. సీనియర్ నేత ఎన్డీ తివారీ ఏర్పాటు చేసిన అఖిలభారత ఇందిర కాంగ్రెస్ (తివారీ)లో చేరారు. పీవీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగాక అర్జున్ సింగ్ మళ్లీ ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చి, 1998లో పార్టీ అధ్యక్షురాలైనప్పుడు ఆమెకు అత్యంత నమ్మకస్థుడిగా అర్జున్ సింగ్ మెలిగారు. తదనంతరం ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.












Click it and Unblock the Notifications