తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేసవి సెలవులు పొడిగింపు
ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెల ముగిసి వారం రోజులు కావొస్తున్నా.. ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
జూన్ 14వ తేదీన ఆదివారం ఉంది.. దాంతో జూన్ 15 నుండి అంగన్వాడీ కేంద్రాలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 2 వ తేదీ నుంచే అంగన్వాడీ కేంద్రాలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. జూన్ మొదటి వారంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఈ క్రమంలో చిన్నారులు ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సైతం ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అటు పాఠశాలలు, ఇటు అంగన్వాడీ కేంద్రాలు జూన్ 15 వ తేదీనే తెరుచుకోనున్నాయి. తెలంగాణలో వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ప్రకటించారు. అయితే ఎండలు అలాగే ఉన్న కారణంగా ఆ తర్వాత జూన్ 14 వరకు పొడిగించారు.












Click it and Unblock the Notifications