కర్రల దాడి వల్లనే పోలీసులు కాల్పులు జరిపారు: సబితా ఇంద్రారెడ్డి
హోంమంత్రి ప్రకటనపై తెలుగుదేశం శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర స్పందిస్తూ హోంమంత్రి ప్రకటన చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల పక్షం వహించాలని, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించి ప్రజలపై దాడి చేయించడం అన్యాయమన్నారు. ఈ ఘటనలో ఇద్దరి మృతిపై ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. పోలీసుల ద్వారా దమనకాండ సృష్టించి అభివృద్ధి చేస్తామంటే ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాకరాపల్లి థర్మల్ ప్రాజెక్టు వెనుక ఉన్న పెట్టుబడిదారులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
కాకరాపల్లి ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టుబడిదారులెవరో చెప్పాలని దూళిపాళ్ల నరేంద్ర కోరారు. రబ్బరు బుల్లెట్లకే మనుషులు చనిపోతుంటే ఎటువంటి బుల్లెట్లు వాడుతున్నారో అర్థమవుతోందని సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులున్నాయని, కొంత మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆమె అన్నారు. సభ లోపల ఒక్కటి బయట ఒక్కటి మాట్లాడుతే సరి కాదని ఆమె అన్నారు.