చంద్రబాబుపై ఎఫెక్ట్: తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుల సందిగ్ధం
నిజానికి, శనివారం నుంచి సభకు హాజరు కావాలని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అనుకున్నారు. కానీ, సభకు హాజరు కాకూడదనే అభిప్రాయాన్ని కొంత మంది సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సమావేశమై ఓ నిర్ణయానికి రావాలని భావించారు. చర్చలు విస్తృతంగా జరిగినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో వారంతా శనివారం శాసనసభకు దూరంగానే ఉన్నారు. సీమాంధ్ర సభ్యులకు చంద్రబాబు శుక్రవారం సాయంత్రం క్లాస్ తీసుకున్నారు. దీంతో వారు సమైక్యాంధ్ర నినాదంతో సభను అడ్డుకోవడాన్ని విరమించకున్నారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను మాత్రం ఆయన దారికి తేలేకపోయారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులతో జరిగిన సమావేశం నుంచి చంద్రబాబుపై ఆగ్రహంతో తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు.
తమ పార్టీ తెలంగాణ ప్రాంత సభ్యులు సభలో తెలంగాణ అంశంపై ఆందోళనకు దిగిన సందర్భంలో చంద్రబాబు సభలో ఉండడం లేదు. తెలంగాణ సభ్యులు ఆందోళన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధినేతగా ఏదో ఒక విషయం మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. శనివారం తమ పార్టీ తెలంగాణ ప్రాంత సభ్యులు సభకు వస్తారనే ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.