ఎపి అసెంబ్లీ మరణించింది, మాసికం నిర్వహిస్తాం: కోదండరామ్

మిలియన్ మార్చ్ స్ఫూర్తిని సాగిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుత శాసనసభ సీమాంధ్ర అసెంబ్లీగా మారిందని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరణించిందని, దానికి నెల మాసికం చేస్తామని ఆయన చెప్పారు. మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన అరెస్టులకు సోమవారం ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు జరుగుతాయని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధుల రాజీనామాలను సందర్భం వచ్చినప్పుడు అడుగుతామని ఆయన చెప్పారు. కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా ఉద్యమం ఆగబోదని ఆయన అన్నారు. మిలియన్ మార్చ్తో సంబంధం లేని ఇంటర్మీడియట్ విద్యార్థులను, ఇతర వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టారని ఆయన అన్నారు. మిలియన్ మార్చ్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉంటే ప్రశాంతంగా జరిగి ఉండేదని ఆయన అన్నారు.
తెలంగాణ విద్యార్థులు మరణించినప్పుడు వారి కుటుంబాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించి ఉంటే ట్యాంక్ బండ్ మీది విగ్రహాలను సందర్శించడానికి వచ్చి ఉంటే అభ్యంతరం ఉండేది కాదని ఆయన అన్నారు. పోలీసులు తెలంగాణ ఉద్యమకారులను అక్రమంగా నిర్బంధిస్తుంటే చంద్రబాబు శాసనసభలో లేవనెత్తలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వ్యక్తం కావడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుత శాసనసభ ఈ రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించడానికి సాగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications