లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై వి. హనుమంతరావు మండిపాటు
మిలియన్ మార్చ్ సందర్బంగా విగ్రహాలను ధ్వంసం చేయాలని మూడు నెలల క్రితమే పథక రచన జరిగిందని అనడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిందారు. మూడు నెలల క్రితమే పథక రచన చేస్తే నిఘా విభాగం ఏం చేస్తోందని, పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. మిలియన్ మార్చ్ సందర్బంగా విధ్వంసం దిగుతున్నవారిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారని ఆయన అన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగితే అన్నదమ్ముల్లా విడిపోవడానికి అవకాశం ఉండదని, వైషమ్యాలు పెరుగుతాయని ఆయన అన్నారు. హైదరాబాదులో జరిగిన ఫాక్షన్ హత్యల గురించి శ్రీకృష్ణ కమిటీ ఎందుకు మాట్లాడలేదని ఆయన అడిగారు.
సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం లేదని, కొంత మంది నాయకులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పుడు గానీ ఎన్నికల ప్రణాళికలో చేర్చినప్పుడు గానీ తెలంగాణ అంశాన్ని ఎందుకు వ్యతిరేకించలేదని, ఇప్పుడు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఆ నిర్ణయం జరిగే వరకు మిలియన్ మార్చ్ వంటి సంఘటనలు జరగకూడదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రపై గతంలో మాట్లాడని నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు మద్దతు ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.