ఆ ఐదుగురు సినీరంగాన్ని నాశనం చేస్తున్నారు: నట్టి కుమార్
సినిమా రేట్లు పెంచడం వల్ల పైరసీ మరింతగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాతల అభిప్రాయాన్ని పక్కన పెట్టి ఆ ఐదుగురు ముఖ్యమంత్రిని కలిసి టికెట్ రేట్లు పెంచాలని కోరారని ఆయన చెప్పారు. తామంతా నిర్మాతలం కాదా ఆయన అడిగారు. టికెట్ రేట్లు పెంచితే తాము ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఆయన చెప్పారు. నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ ఏళ్ల తరబడి సినిమాలు నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. నిర్మాతల మండలి నిర్ణయం గానీ ఫిల్మ్ ఛేంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలను కాదని ఆ ఐదుగురు పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి టికెట్ ధరలు పెంచాలని కోరారని ఆయన చెప్పారు.
ఈ ఫిల్మ్ నగర్ మాది, తెలుగు సినీ రంగం మాది అనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారని, తమను కాదని చేస్తే సర్వనాశనం అవుతారని, అవుతున్నారని ఆయన చెప్పారు. వారు తీసిన భారీ సినిమాలు బాక్సాఫీసు వద్ద దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెంపు వ్యవహారంలో ఓ కుంభకోణం ఉందని, ఆ కుంభకోణం బయటపడుతుందని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెరిగితే చిన్న సినిమాలు ఎక్కువ కాలం ఆడబోవని ఆయన అన్నారు.