ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, వైయస్ జగన్ పని ఉత్తదేనా?
కర్నూలులో 99.87 శాతం, నెల్లూరు జిల్లాలో వంద శాతం, అనంతపురం జిల్లాలో 96.15 శాతం, కడప జిల్లాలో 99.78 శాతం, చిత్తూరు జిల్లాలో 99 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 99.51 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 75.17 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 99.33 శాతం ఓట్లు పోలయ్యాయి. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల గల వ్యతిరేకత వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ వర్గం అభ్యర్థిని నిలువరించడానికి కాంగ్రెసు రెండో ప్రాధాన్యతా ఓటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కేటాయించింది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటు బలంతో తెలుగుదేశం అభ్యర్థి గెలిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మద్దతు కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఉంటుందని భావిస్తున్నారు. దీనివల్ల వైయస్ జగన్ వర్గం అభ్యర్థి నారాయణ రెడ్డి ఓడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పైగా, మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ కడపలో మకాం వేసి కాంగ్రెసు అభ్యర్థి విజయానికి తీవ్రంగా కృషి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి మద్దతు కోసం ప్రయత్నాలు సాగించారు. దీంతో వైయస్ జగన్ అభ్యర్థి విజయం కష్టమేనని అంటున్నారు.
ఇదిలా వుంటే, అనంతపురం జిల్లాలో కాంగ్రెసుకు ఎదురు గాలి వీచినట్లు చెబుతున్నారు. పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వర్గం తిరుగుబాటు వల్ల కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి విజయం అంత సులభం కాదని అంటున్నారు. అయితే, పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి వైయస్ జగన్ వర్గం కూడా మద్దతిస్తోంది. అయినా ఫలితం ఉండకపోవచ్చునని చెబుతున్నారు.