ప్రభుత్వాధినేత తనయుడికి యాభై శాతం వాటా: జెపి ధ్వజం
ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం, అవినీతులతో పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని ఆయన అన్నారు. భూ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలు నష్టాల్లో ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని ఆయన అన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి, భూ కేటాయింపులకు సంబంధం ఉందని ఆయన అన్నారు. భూతద్దం పెట్టినా కనిపించని దేశానికి చెందిన రస్ ఆల్ఖైమా కంపెనీతో ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన చెప్పారు. వోక్స్ వ్యాగన్కు అప్పన్నంగా పది కోట్ల రూపాయలు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. 2010 వరకు 320 కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీలో రస్ ఆల్ఖైమా సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆయన చెప్పారు.
కాకినాడ కంపెనీతో ఓఎన్జిసి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పంద పత్రంపై ప్రైవేట్ వ్యక్తి సంతకం చేశారని ఆయన చెప్పారు. ఒప్పందాలు ఎలా జరుగుతాయో, ఎలా చేసుకోవాలో కూడా తెలియకుండా ఒప్పందాలు జరిగాయని ఆయన అన్నారు. రైతులను బెదిరించి కాకినాడ సీపోర్టు రైతుల నుంచి భూములను సేకరించిందని ఆయన విమర్శించారు. విశాఖలోని బ్రాండిక్స్కు వేయి ఎకరాలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఫ్యాబ్ సిటీకి 1070 ఎకరాలు ప్రమాణాలు పాటించకుండా కేటాయించారని ఆయన ఆరోపించారు. విఐపిలకు, విల్లాలకు విలువైన భూములను కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.