చంద్రబాబు, కిరణ్ కౌంటర్కు వైయస్ జగన్ వ్యూహం ఏమిటి?
తన తండ్రి వైయస్సార్ తిరిగి రాలేడని, జవాబు చెప్పలేడని తెలిసి చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కయి ఆరోపణలు చేస్తున్నారని ఆయన పదే పదే విమర్శిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న ఆయన అదే విషయాన్ని తన ప్రసంగాల్లో ప్రధానంగా చెబుతున్నారు. నల్లధనం కేసులో నిందితుడు హసన్ అలీ వెల్లడించిన విషయాలు వైయస్ జగన్కు అనుకోకుండా కలిసి వచ్చాయి. హసన్ అలీకి, చంద్రబాబుకు మధ్య సంబంధాలున్నాయని వైయస్ జగన్కు చెందిన సాక్షి దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించడం ఇందులో భాగమే.
కాంగ్రెసును కూడా ఆయన చిత్తు చేసేందుకు సిద్ధపడ్డారు. ఇందుకుగాను, ఆయన దినపత్రిక సాక్షి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు వదేరా వ్యాపారాలను లక్ష్యం చేసుకుని వార్తాకథనాలు ప్రచురించింది. అలాగే, చిరంజీవిని కూడా జగన్ టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ నాయకుడిగా మారిన ఓ ఆగ్ర హీరో డబ్బులను కూడా తాను హ్యాండిల్ చేసినట్లు హసన్ అలీ చెప్పిన విషయాన్ని అందుకు వైయస్ జగన్ తెలివిగా వాడుకుంటున్నారు. ఆ అగ్రహీరో చిరంజీవేనని చెబుతూ సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానించింది.
చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని చెప్పడానికి జగన్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాడుకుంటున్నారు. కర్నూలు, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన అభ్యర్థులను ఓడించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కమ్మక్కయ్యారని ఆయన ప్రచారంలో పెడుతున్నారు. శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి, తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఉదంతాన్ని కూడా ఆ కోణం నుంచే వ్యాఖ్యానించే పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుల డైరెక్షన్లో వైయస్ వివేకానంద నాటకాన్ని రక్తి కట్టించారని ప్రచారంలోకి తెస్తున్నారు. ఏమైనా, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను ఎదుర్కుని నెంబర్ వన్ పార్టీగా వైయస్సార్ కాంగ్రెసును నిలబెట్టడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.