వైయస్ వివేకానంద రెడ్డి డ్రామాను నడిపిన కిరణ్, చంద్రబాబు?
శాసనసభలో తెలుగుదేశం సభ్యులపై దాడికి ప్రయత్నించిన తర్వాత వైయస్ వివేకానంద రెడ్డి వ్యవహారమంతా కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నట్లే జరిగిందని అంటున్నారు. ఇందుకుగాను మంత్రి వట్టి వసంతకుమార్, పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్క్పిప్టు తయారు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సభలో క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో వివేకానంద రెడ్డి వట్టి వసంతకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్లతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లోనే వైయస్ వివేకానంద రెడ్డి స్క్రిప్టు రెడీ అయినట్లు చెబుతున్నారు.
సభలో క్షమాపణ చెప్పే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి రాసుకొచ్చిన ప్రకటన చదివారు. దాన్ని బట్టి ఓ పద్ధతి ప్రకారం ఆ ప్రకటనను తయారు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. వివేకానంద రెడ్డిని బర్తరఫ్ చేసి, భూ కేటాయింపులపై సంయుక్త సభా సంఘాన్ని వేసే వరకు సభకు రానని చెప్పిన చంద్రబాబు తన డిమాండ్లు నెరవేరకుండానే సభకు రావడం వెనక కూడా వ్యూహం ఉందని అంటున్నారు. అది జగన్ను అడ్డుకునే వ్యూహం తప్ప మరేమీ కాదని అంటున్నారు.