వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై చర్యలకు పెరుగుతున్న ఒత్తిడి
కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై వేటు వేయాల్సిందేనని కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు. వారిపై చర్యలు తీసుకుంటేనే ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తామని కూడా ఆయన అంటున్నారు. చర్యలు తీసుకోవడం వల్ల తలెత్తే పరిణామాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డి శ్రీనివాస్ ఆలోచిస్తున్నారు. చర్యలు తీసుకోనంత వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఏ విధమైన ప్రభావం పడదు. కడప జిల్లాకు చెందిన నలుగురైదుగురు శాసనసభ్యులపైన చర్యలు తీసుకున్నా పరిణామాలు ఎటు దారి తీస్తాయోననే ఆందోళనలో కాంగ్రెసు నాయకత్వం ఉంది.
జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కూడా కాంగ్రెసు నాయకత్వానికి సవాల్ విసురుతున్నారు. తమపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గురువారం అన్నారు. చర్యలు తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తగిన వ్యూహరచన చేస్తారా అనే సందేహం ఆయన ప్రకటనను బట్టి వ్యక్తమవుతోంది. కడప జిల్లాకు చెందిన కమలమ్మ, శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిపై చర్యలు తీసుకునే ఆలోచనలో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.