జగన్ దూకుడు: అభ్యర్థుల ఎంపికలోనే కాంగ్రెసు, టిడిపి సతమతం
అభ్యర్థుల ఎంపిక కోసం, ప్రచార వ్యూహ రచన కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో కడపజిల్లా నేతలతో సమావేశమయ్యారు. కడప, పులివెందుల అభ్యర్థులపై కసరత్తుచేశారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను దీటుగా ఎదుర్కోగల అభ్యర్థులకోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. లోక్సభ సీటుకు కందుల రాజమోహన్రెడ్డి, శివానందరెడ్డి, రామసుబ్బారెడ్డి, పుట్టా నరసింహారెడ్డి, మైసూరారెడ్డి పేర్లు పరిశీలిస్తుండగా, పులివెందుల నియోజకవర్గానికి బీటెక్ రవి, ఎమ్మెల్సీ సతీష్రెడ్డి భార్య సుమతి, సతీష్రెడ్డి సోదరి భాగ్యమ్మ పేర్లు పరిశీలిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కందుల సోదరుల్లో ఒకరిని గానీ, మైసూరారెడ్డిని గానీ కడప లోక్సభ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశముంది. నేడో రేపో చంద్రబాబు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు.
కాగా, అభ్యర్థుల ఖరారు కోసం కాంగ్రెసు నాయకులు కుస్తీ పడుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. పులివెందుల నుంచి వైయస్ వివేకానంద రెడ్డిని, కడప పార్లమెంటు సీటు నుంచి ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని పోటీకి దించాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.