వైయస్ జగన్పై పోరులు ఆదిలోనే కిరణ్ కుమార్ రెడ్డి తడబాటు
ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. తెలుగుదేశం పార్టీని బలహీనపరుస్తూ కాంగ్రెసును బలోపేతం చేసే ఆలోచన అది. ఇందులో భాగంగా ఆయన తొలుత ఎంవి మైసురా రెడ్డిని తెలుగుదేశం నుంచి కాంగ్రెసులోకి లాగే ప్రయత్నం చేశారని వినికిడి. ఆ తర్వాత అతి కష్టం మీద కందుల రాజమోహన్ రెడ్డి, కందుల శివానంద రెడ్డి సోదరులను తీవ్రమైన చిక్కులను దాటి కాంగ్రెసులోకి రప్పించగలిగారు. కానీ వారితో కడప పార్లమెంటు సీటుకు పోటీ చేయించేందుకు మాత్రం వారిని ఒప్పించలేకపోయారు.
నిజానికి, కందుల రాజమోహన్ రెడ్డికి కడప లోకసభ టికెట్ ఇవ్వడం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్కు ఇష్టం లేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబట్టారు. అయితే, కందుల సోదరులు కాంగ్రెసులోకైతే వచ్చారు గానీ పోటీ చేయడానికి సిద్ధపడడం లేదు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని లోకసభకు పోటీ చేయించడం కిరణ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదని తెలుస్తోంది. కందుల సోదరులను ఒప్పించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి డిఎల్ రవీంద్రా రెడ్డి, శాసనసభ్యుడు వీరశివార రెడ్డి ద్వారా ఇంకా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. గురువారం సాయంత్రం రవీంద్రా రెడ్డి, వీరశివా రెడ్డి కందుల సోదరులతో సమావేశమయ్యారు.