భారత్ మరో ఘన విజయం, దీక్ష విరమించిన అన్నా హజారే
జీవో జారీ చేసినందుకు హజారే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. దీక్షా శిబిరం వద్ద సామాజిక కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఇండియా గేటు వద్ద విజయోత్సవ వేడుకలలో పాల్గొనాలని హజారే పిలుపునిచ్చారు. తనతో పాటు దీక్ష చేపట్టిన మద్దతుదారులకు అన్నా హజారే నిమ్మరసం ఇచ్చి దీక్ష ను విరమించచేశారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, అవినీతిని రూపుమాపాలన్నదే తమ అంతిమ లక్ష్యమని హజారే అన్నారు. అవినీతి అంతానికి ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఆగస్టు 15లోగా లోక్పాల్ బిల్లు అమలు చేయకపోతే మళ్లీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హజారే హెచ్చరించారు. ఇది ప్రజలందరి విజయంగా ఆయన అభివర్ణించారు.
జన్ లోక్పాల్ బిల్లు రూపకల్పనకు వేసే కమిటీకి ప్రణబ్ ముఖర్జీ కో చైర్మన్గా వ్యవహరించే అవకాశాలున్నాయి. న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్, ఎకె ఆంటోనీ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి.