మీరు రాస్తే సమాధానం చెప్పను: మీడియాపై సిఎం వ్యంగ్యాస్త్రాలు

ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం లేదని, 294 శాసనసభ నియోజకవర్గాలలో పులివెందుల ఒకటి, 42 పార్లమెంటు నియోజకవర్గాలలో కడప ఒకటని వాటిని ప్రత్యేక ఎన్నికలుగా చూడవలసిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నించారు. మంత్రులు, శాసనసభ్యులు వెళ్లి ప్రచారం చేయడాన్ని ఆయన సమర్థించారు. కేవలం ఈ ఎన్నికలకే మంత్రులు వెళ్లడం లేదని అన్నారు. ఉప ఎన్నికలు ఎక్కడ, ఎప్పుడు జరిగినా మంత్రులు, శాసనసభ్యులు వెళ్లి ప్రచారం చేస్తారని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నుండి ఎదిగిన వారంతా ఆ పార్టీ గెలుపు కోసం పని చేయడంలో తప్పేమిటని ప్రశ్నించారు. తాను కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కడపలో డజను మంది మంత్రులను మీడియా రాసుకుంటుందని మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకొనే ఊహాగానాలన్నింటికి నన్ను ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పనని అన్నారు. కడపకు వెళ్లి మంత్రులు ప్రజలను పట్టించుకోలేదనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. మీడియా దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వారి అవసరాలు తీర్చడానికే మేము ఉన్నామని అన్నారు. కడపలోజరిగిన ఎన్నికలు మాత్రమే మేం సీరియస్గా తీసుకోవడం లేదని గతంలో తెలంగాణలో జరిగిన ఎన్నికలను కూడా సీరియస్గా తీసుకున్నామని చెప్పారు.
పార్టీకి వ్యతిరేకంగా పని చేసే ఎమ్మెల్యేలపై నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదని చర్యలు తీసుకునే ముందు ఖచ్చితంగా మీకు తెలుస్తుందని అన్నారు. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్తో విభేదాలపై కూడా సిఎం మీడియాపై గుర్రుమనడం విశేషం. డిఎస్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని అయినప్పటికీ మీడియా మాత్రం సొంత ఊహాగానాలతో విభేదాలు ఉన్నట్టు సృష్టిస్తుందని అన్నారు. కందుల సోదరులతో డిఎస్ సమక్షంలోనే మాట్లాడానని, అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదని, కానీ మీడియాకు మాత్రం విభేదాలు ఉన్నట్లు అర్థమయిందని చురక వేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పార్టీ వల్లే ముఖ్యమంత్రి కాగలిగారన్నారు.












Click it and Unblock the Notifications