వైయస్ జగన్ను ఎత్తిపొడిచిన చిరంజీవి, అధికార దాహమని ఆరోపణ

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించగానే తనను ముఖ్యమంత్రి చేయాలని జగన్ పట్టుబట్టారని, వారసత్వంగా పదవులు ఇవ్వడానికి ఇది రాజరికం కాదని ఆయన అన్నారు. ప్రజలు అంగీకరిస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారని, దాన్ని గుర్తించకుండా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి శవం అక్కడ ఉండగానే జగన్ ముఖ్యమంత్రిని చేయడానికి మద్దతు ఇవ్వాలని అడిగారని, ఇది మన సంప్రదాయం కాదని తాను చెప్పానని, అంతగా జగన్లో అధికార దాహం పేరుకుపోయిందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా వ్యవహరించారని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు తూట్లు పొడుస్తున్నారనే విమర్శలో నిజం లేదని, వైయస్ పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన చెప్పారు. తాను మానసికంగా కాంగ్రెసు మనిషిని అని చెప్పుకున్నారు. కాంగ్రెసు తరఫున రాజకీయంగా సేవలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. రాయలసీమలో ఈ అభిమానం తన జన్మకు చాలునని ఆయన అన్నారు. లౌకిక పార్టీ అయిన కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెసు పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications