ప్రజలతో ఛీకొట్టించుకునేలా ఉంది: జగన్ తీరుపై చిరంజీవి ధ్వజం
హైదరాబాద్లో జగన్ భూ కబ్జాలు తదితర అక్రమ వ్యవహారాలన్నింటిపై త్వరలోనే నిజాలు తెలుస్తాయని అన్నారు. కడప ఎంపీగా డిఎల్ రవీంద్రారెడ్డి, పులివెందుల ఎమ్మెల్యేగా .వివేకానందరెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ వ్యక్తిగా, ఓ ప్రచారకర్తగా ప్రచారానికి వచ్చానని చెప్పారు. కేవలం ఓ వ్యక్తి స్వార్థం, అధికార దాహంతోనే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. అహంకారానికి- ఆత్మ గౌరవానికి పోటీ జరుగుతోందని జగన్ చెప్పటాన్ని చిరు ఖండించారు. నిజానికి జగన్ అహంకారం- ఢిల్లీ ఆత్మగౌరవం మధ్య పోటీగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ వల్లే వైఎస్ ఆరుసార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు ఎంపీ రెండుసార్లు సిఎం అయ్యారు. ఆయన సోదరుడు వివేకానందరెడ్డి కూడా రెండుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు ఎంపి ఒకసారి మంత్రి పదవి అలంకరించారు. ఇంతగా చేయూతనిచ్చిన కాంగ్రెస్ పార్టీని అసహనపరుడైన జగన్ విమర్శించడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఉంది. కడప జిల్లాలోని తల్లులందరూ ఈ విషయాన్ని ఆలోచించాలని చిరంజీవి ఓటర్లకు సూచించారు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో ఉప ఎన్నికలు పెను సవాల్గా మారాయని, దివంగత నేత వైఎస్ వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కు ఓటేసేందుకు సిద్ధ్దంగా ఉన్నారని చెప్పారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురై వైఎస్ పార్థివ దేహం కూడా ఇంకా కనిపించని దుఃఖ సమయంలో 22 మంది ఎమ్మెల్యేలు జగన్ సీఎం అయ్యేందుకు సహకరించాలంటూ నా వద్దకు వచ్చారు. నేను సున్నితంగా తిరస్కరించా. జగన్కు ఇంతటి పదవీ వ్యామోహం తగదు. ఇవి రాచరికపు రోజులు కావు. ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టం మేరకే సీఎం పదవి దక్కుతుంది. వైఎస్ 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గడించిన పిమ్మట సీఎం అయ్యారు. జగన్ మాత్రం 24 గంటల్లోనే సీఎం పదవి ఆశించడం అప్రజాస్వామికం.
రోశయ్య పరిపాలనను సజావుగా సాగనివ్వకుండా చేయడం అవినీతిపరుడైన జగన్కే చెల్లిందని అన్నారు. అన్నా హజారే చేపట్టిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా మద్దతు లభించడం దేశ ప్రజలు అవినీతిని అసహ్యించుకుంటున్నారనడానికి నిదర్శనమన్నారు. ఇదే స్ఫూర్తితో నీతిమంతమైన పాలనను అందించే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డిని అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. సామాజిక న్యాయం కోసమే తాను కాంగ్రెస్తో జత కట్టానని చెప్పారు. సామాజిక న్యాయం సాధించడానికి తనకు ఉన్న 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం సరిపోదని, అందుకే కాంగ్రెస్లో విలీనమయ్యామని చెప్పారు. జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి నియోజకవర్గంలో రాక్షస పాలన సాగిస్తున్నాడన్నారు.