ప్రచారంలో జగన్ ఆస్తులపై సిఎం కిరణ్ కుమార్ వ్యాఖ్యలు చేసేనా?
కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని రోజులు స్తబ్ధగా ఉన్నప్పటికీ ఓ సమావేశంలో పరిటాల రవి హత్య కేసులో జగన్ను నేనే కాపాడాను అని చెప్పి జగన్పై టిడిపి మరోసారి రెచ్చి పోవడానికి ఓ అవకాశం ఇచ్చారు. అయితే ఎన్నికలకు ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి జగన్పై ఘాటుగా వ్యాఖ్యలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఎన్నికలు కొద్ది రోజులే ఉన్న సమయంలో ఇన్నాళ్లూ వైయస్ అనుచరుడిగా ముద్రపడ్డ కిరణ్ జగన్పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తే వోటర్లలోకి నెగిటివ్గా వెళ్లే అవకాశమున్నదని కాంగ్రెసు వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది
ఇందుకోసం ముఖ్యమంత్రి తన ప్రచారంలో జగన్పై అంతగా దృష్టి సారించడని తెలుస్తోంది. డిఎల్, చిరు, చంద్రబాబు తరహాలో జగన్ అక్రమాస్తులపై విమర్శలు చేసే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రముఖంగా జగన్, చంద్రబాబులపై పదునైన మాటలతో విరుచుకు పడకుండా కాంగ్రెసు అభ్యర్థులు వైయస్ వి వేకానందరెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డిలను గెలిపించమని మాత్రమే వోటర్లను కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెసు కడప అభివృద్ధికి ఏం చేసింది, ఇక ముందు ఏం చేయనుంది - తదతర అంశాలను మాత్రమే ఓటర్ల ముందు సిఎం పెట్టున్నట్లుగా తెలుస్తోంది.