డిప్యూటీ సిఎంగా దామోదర రాజనర్సింహ, స్పీకర్గా నాదెండ్ల మనోహర్
కాగా, డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ను శాసనసభ స్పీకర్గా ఎంపిక చేసే అవకాశాలున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలను నాదెండ్ల మనోహర్ నడిపిన తీరు పట్ల కాంగ్రెసు అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ను స్పీకర్గా ఎంపిక చేయడం వల్ల రాజకీయంగా కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే, తనకు సన్నిహిత మిత్రుడైన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. అయితే, అధిష్టానం మాత్రం నాదెండ్ల మనోహర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)కి కొత్త అధ్యక్షుడిని కూడా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. నంది ఎల్లయ్య, బొత్స సత్యనారాయణ, పళ్లం రాజు, మల్లు రవి, సంభాని చంద్రశేఖర్ పేర్లు పిసిసి అధ్యక్ష పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన సంభాని చంద్రశేఖర్ పేరును ప్రతిపాదిస్తున్నారని అంటున్నారు. కానీ, అధికారం మొత్తం ముఖ్యమంత్రి చుట్టే కేంద్రీకృతం కాకుండా వేరే నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోందని చెబుతున్నారు.