సిఎం కిరణ్ కేబినెట్లో ఐదుగురు జగన్ కోవర్టులు ఉన్నారా?
ముఖ్యమంత్రి కిరణ్ గ్రూపులో డిఎల్ రవీంద్రారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్, శ్రీధర్ రెడ్డి, గల్లా అరుణకుమారి తదితరులు ఉండగా, అధిష్టానం విదేయులలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, జానారెడ్డి, పొన్నాల లక్ష్మీనారాయణ, శంకర్ రావు, గీతారెడ్డి తదితరులు ఉన్నారు. గోడ మీది పిల్లుల్లా వ్యవహరిస్తున్న వారు కూడా కేబినెట్లో చాలామందే ఉన్నారంట. రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, రాంరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు గోడమీది పిల్లుల్లా ఉంటూ ఎటు లాభం చేకూరితే అటు ఉండటానికి తయారయి ఉన్నారని తెలుస్తోంది. అయితే కిరణ్కు అధిష్టాన వర్గం, గోడమీది పిల్లుల వర్గం నుండి అంతగా పెద్ద పెద్ద సమస్యలు లేనప్పటికీ జగన్ వర్గం నుండే అసలైన తలనొప్పులు వస్తున్నాయంట.
మంత్రివర్గంలో జగన్ వర్గానికి చెందిన వారు దాదాపు ఐదుగురు ఉన్నారని సమాచారం. అందులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు నిత్యం వినబడుతూనే ఉంటుంది. కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి కూడా గురువారం కోమటిరెడ్డి సోదరులను జగన్ కోవర్టులుగా అభివర్ణించాడు. కోమటిరెడ్డితో పాటు మోపిదేవి వెంకటరమణ, తోట నర్సింహం, విశ్వరూప్, పితాని సత్యనారాయణ పేర్లు జగన్ వర్గం మంత్రులుగా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరెవరూ కూడా జగన్ను బహిరంగంగా సమర్థించిన దాఖలాలు లేక పోవడం విశేషం. అయితే అవకాశం వస్తే మాత్రం జగన్కు లాభం కలిగించడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది.