చంద్రబాబు చేత తెలంగాణపై ప్రకటన చేయించాల్సిందే: నాగం జనార్దన్ రెడ్డి
తాను పెట్టిన సభలు పార్టీకి గానీ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గానీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అనుకూలంగా కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ ఇవ్వాలని అడిగితే వ్యతిరేకం ఎలా అవుతుందని ఆయన అడిగారు. తెలంగాణ నాయకులు సీమాంధ్ర పార్టీలను బతికించాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి నేతలు తమ పార్టీలోనే కాదు, కాంగ్రెసులోనూ ఉన్నారని ఆయన విమర్శించారు. మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు తెలంగాణ సాధనకు ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పిస్తే తప్ప పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.
పిఎసి చైర్మన్గా కొనసాగాలని అనుకుంటే తాను చంద్రబాబు వెన్నంటి ఉండేవాడినని ఆయన అన్నారు. తాను నివేదిక సమర్పించి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. ఐదు వేల కోట్ల రూపాయల రికవరీకి తాను పిఎసి నివేదికను సమర్పించానని, దాన్ని ప్రచురించి బయటపెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.