చిరంజీవికి కాంగ్రెసు అధిష్టానం పిలుపు, విలీనంపై చర్చ కోసమే
శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక పూర్తి కావడంతో ప్రజారాజ్యం పార్టీ విలీనంపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకదాని తర్వాత ఒక్కటి పూర్తి చేసే క్రమంలో కాంగ్రెసు అధిష్టానం వెళ్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టి ప్రజారాజ్యం పార్టీకి చెందిన కొద్ది శాసనసభ్యలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అధిష్టానాన్ని సంప్రదించి మంత్రివర్గాన్ని విస్తరిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి శనివారం చెప్పిన మాటలు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. అదే సందర్భంలో దామోదరం రాజనర్సింహను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలున్నాయి.
ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడి ఎంపిక జరిపే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అనంతరం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే రాష్ట్రంలో తేవాల్సిన మార్పులన్నీ కాంగ్రెసు అధిష్టానం తెచ్చినట్లే అవుతుంది. అప్పటికైనా తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెడుతుందా అనేది అనుమానమే.