దమ్ముంటే ఎమ్మెల్యేలచే విత్ డ్రా చేయించు: జగన్కు బాబు సవాల్
అసెంబ్లీ సమావేశాలకు గంట ముందు కూడా నోటీసు ఇచ్చామని ఆయన చెప్పారు. సభాపతి స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ తన దృష్టికి అవిశ్వాస తీర్మానం నోటీసు రాలేదని చెప్పడం సరికాదన్నారు. అలా చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం అన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని విస్మరిస్తే గవర్నర్ వారిపై చర్యలు తీసుకోవాలని కానీ గవర్నర్ కూడా ప్రభుత్వానికి మద్దతు పలకడం శోచనీయం అన్నారు. అవిశ్వాసంపై అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి అసెంబ్లీకి రాని తెలంగాణ రాష్ట్ర సమితి కూడా టిడిపిని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. ఉద్యమం కోసం అంటూ పుట్టిన టిఆర్ఎస్ పార్టీ గత ఎమ్మెల్సీ ఎన్నికలలో పదిమందిలో ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా అమ్ముడు పోకుండా అడ్డుకోలేక పోయిందని విమర్శించారు.
కాంగ్రెసు పార్టీ అవినీతికి మద్దతు పలుకుతోందన్నారు. వైయస్ చేసిన అవినీతిపై రాజా ఆప్ కరప్షన్ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా టిడిపి ప్రచురించిందన్నారు. వైయస్ అవినీతికి కేంద్రం మద్దతు ఇచ్చిందన్నారు. వైయస్ అవినీతిని ఆదర్శంగా తీసుకుంటూ ఆయన బాటలో ఇప్పుడు పలువురు పయనిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. భావి భారతదేశం దృష్ట్యా అవినీతిపరులపై కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం లోక్ పాల్ బిల్లును అడ్డుకోవద్దని సూచించారు. అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి టిడిపి మద్దతు ఇస్తుందన్నారు. రామ్ దేవ్ బాబా కూడా అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని ఆన్నారు. అవినీతిపై పోరు అంటేనే కేంద్రం భయపడుతోందన్నారు. అవినీతి కారణంగా రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకు విశ్వాసం పోతోందన్నారు. సామాన్యుల స్వరాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. కొంతమంది కోసంవ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు.
వర్షానికి ధాన్యం తడిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రుణాలు రీషెడ్యూల్ చేయలేదని, ఇన్ ఫుట్ సబ్సిడీకి దిక్కులేదన్నారు. రైతులు తీవ్రంగా నష్టం పోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణం అని ఆరోపించారు. రైతులకు ఖర్చులు అంతకంతకు పెరుగుతున్నాయన్నారు. రైతుల సమస్యలు తీర్చకుండా ముఖ్యమంత్రి సదస్సులు, చైతన్యయాత్రలు పెట్టినా లాభం లేదన్నారు. రైతు చైతన్య యాత్ర పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అర్హత లేదన్నారు. రైతుల సమస్యలు తీరకున్నా ముఖ్యమంత్రి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయన్నారు. రైతుల ధాన్యం ఏమాత్రం అమ్ముడు పోవడం లేదని కానీ మార్కెట్లో బియ్యం ధరలు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెసు కార్యకర్తలను ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి రూ.100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఇది చేతకాని, అసమర్థ ప్రభుత్వం అన్నారు. టిడిపి కార్యకర్తలు రైతులకు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.