కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులను దుమ్మెత్తి పోసిన వైయస్ జగన్
నిరుపేదలు, రైతుల ముఖాల్లో చిరునవ్వులు నింపిన వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై ఆనాడు చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టారని, ఇప్పుడు 90 మంది శాసనసభ్యులున్నా అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ పెద్దలతో కుమ్మక్కయి చంద్రబాబు నాయుడు స్పీకర్ ఎన్నికను రాజకీయం చేశారని, రైతు సమస్యలపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే ఆలోచన చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెసుతో చంద్రబాబు కమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోతుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు డిపాజిట్లు దక్కవని ఆయన అన్నారు. చంద్రబాబుకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బుద్ధిరావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగనివ్వాలని ఆయన అడిగారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల దీనస్థితిని చూపించడానికే తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి చెందిన చిత్తూరు జిల్లా ధర్నాలో తాను పాల్గొన్నట్లు జగన్ చెప్పారు. వరి రైతు ఉరికి సిద్ధపడుతున్నారని, ప్రభుత్వం మాత్రం కళ్లు తెరవడం లేదని ఆయన విమర్శించారు. రైతుల కన్నీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన అన్నారు. నిరుపేదలకు మంచి చేయాలన్న నాయకుడు రాష్ట్రంలో లేకుండా పోయాడని ఆయన అన్నారు.
బిటి విత్తనాల రైతులతో ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆయన విమర్శించారు. బిటీ విత్తనాలు 90 లక్షల ప్యాకెట్లు కావాల్సి ఉండగా 40 లక్షల ప్యాకెట్లు మాత్రమే పంపిణీ చేసిందని ఆయన అన్నారు. కౌన్సెలింగ్ రైతులకు కాదు, ప్రభుత్వానికి కావాలని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలోని మామిడి పండ్ల రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రైతుల వరిధాన్యాన్ని కొనే దిక్కు లేదని ఆయన అన్నారు.