కాంగ్రెసులో కాపుల ఆధిపత్యం, జగన్ వ్యవహారంతో అధిష్టానం వ్యూహం
విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా చేయడమే కాకుండా అన్నిరకాలుగా స్వేచ్ఛనిచ్చినట్లు భావిస్తున్నారు. అందువల్లనే బొత్స సత్యనారాయణ దూకుడుగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పక్కకు నెడుతూ క్రమంగా ఆయన ముందుకు దూసుకుపోతారని అంటున్నారు. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కూడా ముఖ్యమైన స్థానం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావును కూడా దూరం చేసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధంగా లేదని అంటున్నారు. దాసరి నారాయణ రావు పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం అందుకు నిదర్శమని చెబుతున్నారు.
రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యంలోని తెలుగుదేశం పార్టీని, రెడ్ల ఆధిపత్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడానికి తగిన సత్తా ఉన్న సామాజిక వర్గం కాపు అనే భావనతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కమ్మ సామాజిక వర్గంతో కోస్తాంధ్రలో కాపు వర్గానికి గల వైరం కూడా దీనికి తోడవుతుందని అంటున్నారు. ఏమైనా, రాష్ట్ర కాంగ్రెసులో కొత్త యుగం ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.