తెలంగాణపై తేల్చాల్సింది సోనియా గాంధీనే, బంతి ఆమె కోర్టులోనే
చిదంబరం మాటల్లో మరో విషయం కూడా తెలిసిపోయింది. పార్టీపరంగా తెలంగాణపై నిర్ణయం తీసుకోలేదని కొత్త మెలిక పెట్టారు. పార్టీపరంగా నిర్ణయం జరగకుండానే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చిదంబరం ప్రకటించారా అనే తెలంగాణ ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షాలను కూడా సంప్రదించాలని ఆయన అంటున్నారు. ఇదంతా చూస్తుంటే సోనియా తప్ప మరెవరూ తెలంగాణపై తేల్చే ప్రసక్తి లేదనేది అర్థమైపోయింది. సోనియా మనసులో ఏముందనే విషయాన్ని ఎవరూ పసి గట్టలేకపోతున్నారు.
తెలంగాణ అంశాన్ని నీరుగార్చే దిశగానే ఆమె సాగుతున్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పదవుల పంపకం, ఇతరత్రా విషయాల్లో ఆమె కచ్చితంగా శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదో అధ్యాయాన్ని అమలు చేయడానికి పచ్చ జెండా ఊపినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే, తెలంగాణ కాంగ్రెసు నాయకుల మీద మాత్రం తెలంగాణ కత్తి వేలాడుతూనే ఉంది. తెలంగాణపై తేల్చాల్సింది సోనియా గాంధీయేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే విధంగా చిదంబరం వ్యాఖ్యలున్నాయి.