లగడపాటిని ఉతికి ఆరేసిన తెలంగాణ నాయకులు, దిష్టిబొమ్మలు దగ్ధం
లగడపాటి రాజగోపాల్ తెలంగాణలో పోటీ గెలిస్తే తాను దేశం విడిచి వెళ్లిపోతానని, గెలవకపోతే లగడపాటి రాజకీయాల నుంచి తప్పుకోవాలని తెలుగుదేశం శానససభ్యుడు గంగుల కమలాకర్ అన్నారు. లగడపాటిని పిచ్చికుక్క కరిచిందని ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటిని హైదరాబాదులో తిరగనివ్వబోమని ఆయన హెచ్చరించారు. దమ్ముంటే లగడపాటి రాజగోపాల్ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి పోటీ చేసి గెలవాలని తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు సవాల్ చేశారు. బాన్సువాడ సీటుకు ఇటీవల పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా చేశారు.
లగడపాటికి డబ్బు మదం ఎక్కిందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. లగడపాటి జగన్ వైపు ఉంటారో, కాంగ్రెసుతో ఉంటారో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ వస్తుందని లగడపాటి భయపడుతున్నారని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. తోటి పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ను లగడపాటి పోస్టు మ్యాన్ అనడాన్ని కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తప్పు పట్టారు.
తెరాస నాయకులు జగదీశ్వర్ రెడ్డి, శ్రవణ్, తెరాస విద్యార్థి విభాగం నాయకుడు సుమన్ లగడపాటి రాజగోపాల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లగడపాటిని పిచ్చికుక్క కరిచిందని చాలా మంది నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.