అది నా వల్ల కాదు: కోర్ కమిటీలో తెలంగాణ అంశంపై సోనియా గాంధీ
ఇటీవల తమను కలిసిన టి-కాంగ్రెసుకు కూడా కేంద్రమంత్రులు అమ్మ చెబితేనే అవుతుందని తేల్చి చెప్పారు. విదేశీ పర్యటన ముగించికొని వచ్చిన సోనియా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావించిన టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు సోనియా తన అశక్తత వ్యక్తం చేయడంతో వారు నీరుగారి పోయారు. ఇన్నాళ్లు వారు సోనియాపై నమ్మకంతో ఉన్నారు. తెలంగాణలో కూడా వారు అదే మాటను చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ సోనియా అనూహ్యంగా తన అశక్తత వ్యక్తం చేయటంతో వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేది కాదని కూడా కొందరు అర్థం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పలువురు తాము అధిష్టానానికి డెడ్ లైన్లు పెట్టలేదని చెప్పి తప్పించుకోవాలని చూడగా, మరికొందరు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్టుగా అర్థమవుతోంది. జూన్ 30 వరకు తెలంగాణపై తేల్చకుంటే వచ్చే నెల 5 నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని, నిరాహార దీక్ష భగ్నం చేయాలని చూస్తే రాజీనామాలకు సిద్ధమని టి-కాంగ్రెసు చెప్పింది. అయితే వారిని చల్లబర్చడానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఇటు తెలంగాణవాదులను, అటు తమ ప్రజాప్రతినిధులను కూల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తమకు తెలంగాణ మినహా మరేదీ వద్దని చెబుతున్న టి-కాంగ్రెసు తమ రాజీనామాలకు ఎంత వరకు కట్టుబడి ఉంటుందో చూడాల్సిందే.