జానా ఇంటికి కెసిఆర్: తెలంగాణపై ఒత్తిడికి వ్యూహం
సామూహిక రాజీనామాల ద్వారా మాత్రమే కేంద్రం దిగి వస్తుందని, అందుకు మంత్రులు ముందుకు రావాలని కెసిఆర్ సూచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చట్టబద్దమైన ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం ద్వారా పరిష్కారం కనిపెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కెసిఆర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
రాజీనామాలు చేయడం వల్ల ఉప ఎన్నికలు వస్తే వారిని గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రులకు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులకు, శానససభ్యులకు ఆయన భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా చేసే విషయంలో వెనక్కి తగ్గవద్దని కెసిఆర్ జానా రెడ్డికి నచ్చజెప్పేందుకు ఆయన జానారెడ్డిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో తాము అడుగు పెట్టలేని స్థితిలో కెసిఆర్ భరోసాకు కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సానుకూలంగా ప్రతిస్పందించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా, కేంద్రంలో తెలంగాణపై సంభవిస్తున్న పరిణామాలు జానా రెడ్డికి తెలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి సన్నిహితులు కావడంతో ఢిల్లీలో జరిగే విషయాలు జానారెడ్డికి తెలుస్తాయి. వాటిని తెలుసుకుని తగిన నిర్ణయం తీసుకోవడానికి కూడా జానాతో భేటీ కెసిఆర్ పూనుకున్నట్లు చెబుతున్నారు. జానారెడ్డిని కలవడం ద్వారా మంత్రులను రాజీనామాలకు సిద్ధం చేసేందుకు కెసిఆర్ సిద్ధపడినట్లు సమాచారం.