తెలంగాణపై సోనియాకు చిక్కులు, మండలిపైనే దృష్టి
చట్టబద్దమైన తెలంగాణ ప్రాంతీయ మండలికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను మినహాయిస్తే మిగతా కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు అంగీకరించే అవకాశాలున్నాయి. సగం మంది దాకా కాంగ్రెసు తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు దీనికి సర్దుబాటు కావడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఇది అంగీకారయోగ్యం కావచ్చు. కానీ వరంగల్, కరీంనగర్ వంటి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఇది మింగుడు పడదు. పైగా, వారికి తమ తమ నియోజకవర్గాల్లో తిరగడం కూడా కష్టమే అవుతుంది. దీన్ని పారా మిలటరీ బలగాల ద్వారా ఎదుర్కోవాలని కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్లు తెలుస్తోంది. ఇది కాంగ్రెసుకు రాజకీయంగా నష్టం కలిగించే ప్రమాదం ఉంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు తెలంగాణ ప్రజా సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు. ప్రాంతీయ మండలి ఏర్పాటు ప్రతిపాదనపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిప్పులు చెరిగారు. దీనిపై మంత్రి కె. జానా రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. చాలా మంది తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రాంతీయ మండలిని వ్యతిరేకించే అవకాశాలే ఉన్నాయి. అయితే, ప్రాంతీయ మండలి ద్వారా వీరు కూడా 2014 ఎన్నికల వరకు లాగుదామనే అభిప్రాయానికి కూడా రావచ్చు. అలా సర్దుబాటుకు ఇష్టపడనివారు తెరాసలోకి వెళ్లిపోవచ్చు.
చట్టబద్దమైన తెలంగాణ ప్రాంతీయ మండలికి తాము వ్యతిరేకమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగా సమైక్యవాదులు మౌనం పాటించి, కాంగ్రెసును ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కాంగ్రెసుపై తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించినా ఆశ్చర్యం లేదు. ఎటు చూసినా, కాంగ్రెసు పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలికి చిక్కులు తప్పేట్లు లేవు.