ఇటు పిసిసి చీఫ్ బొత్స అటు ముఖ్యమంత్రి కిరణ్!
సీమాంధ్ర మంత్రులు అయిన ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరారరెడ్డిలతోనూ సిఎం భేటీ అయ్యారు. ఏం చేయాలనే విషయంపై చర్చించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహాతోనూ సంక్లిష్ట పరిస్థితిపై చర్చించారు. ఈ భేటీకి డిజిపి దినేష్ రెడ్డి హాజరయ్యారు. దీంతో టి-కాంగ్రెసు నేతలు బుజ్జగించాలని వారు తమ పట్టు వీడకుండా సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలనే విషయంపై డిజిపితో ముఖ్యమంత్రి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక పిసిసి చీఫ్ బొత్స సత్తిబాబు రెండో రోజు కూడా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పలువురు మంత్రులు, ఎంపీలను ఆయన తన ఇంటికి ఆదివారం ఉదయం ఆహ్వానించి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే వారు ససేమీరా అనడంతో సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. అయితే సిఎం, పిసిసి చీఫ్ టి-కాంగ్రెసు నేతలను బుజ్జగించే ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నారు.