శ్రీ అనంతపద్మనాభ స్వామీ ఆరో నేలమాళిగ మిస్టరీ

సంపద లెక్కతేలుస్తున్న కమిటీ సభ్యులలో ఒకరికి కాలు విరిగిపోగా, మరొకరి తల్లి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా మరణించారు. ఈ విషయాలన్నింటినీ అందుకు నిదర్శనంగానే భక్తులు చెబుతున్నారు. నాగబంధాన్ని తెరవడం అంత సులభమూ కాదు, మంచిదీ కాదని వారంటున్నారు. పైగా దాని తాళం చెవి లభించడం లేదని కూడా చెబుతున్నారు. అనంత పద్మనాభస్వామి వేయి పడగల శేషనాగు మీద శయనిస్తారు కాబట్టి.. ఆ ముద్రలో ఉన్న స్వామి ఆలయంలో మాళిగలను - అందునా నాగబంధం ఉన్న మాళిగలను తెరవడం ఏమాత్రం సరికాదని వారు చెబుతున్నారు. దాదాపు శతాబ్దం క్రితం ఒకసారి కేరళలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు కూడా ఈ మాళిగలను తెరుద్దామన్న ప్రయత్నం చేసినా, నీళ్లు ప్రవహిస్తున్న శబ్దాలు రావడంతో మానుకున్నారన్న కథనాలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.
మొత్తం సంపద ఎంతుందో, ఏవేం ఉన్నాయో చూసి జాబితా సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఇందులో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇద్దరు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఆరు నేలమాళిగల్లో ఉన్న అపార సంపదను లెక్కిస్తూ, దాని జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రాజకుటుంబానికి చెందిన ఇద్దరు కూడా ఉంటున్నారు.
ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం బయటపడ్డ సంపద వివరాలు ఈ విధంగా ఉన్నాయి -
- నాటి రాజకుటుంబానికి చెందిన కిరీటాలు
- 17 కిలోల బంగారు నాణేలు
-2.5 కిలోల బరువు, 18 అడుగుల పొడవు ఉన్న షరపోలి మాల
-బంగారు తాళ్లు
- ఒక బస్తా నిండా వజ్రాలు
- వేల సంఖ్యలో పురాతన నగలు
- బంగారు పాత్రలు
- వివిధ రాజకుటుంబాలు, యాత్రికులు, వర్తకులు చేసిన దానాలు
- పలు శతాబ్దాల క్రితం నాటి అత్యంత అరుదైన, విలువైన మాణిక్యాలు
- పురాతన బంగారు ఆభరణాలు
- వజ్రాలు, నవరత్నాలతో పాటు బెల్జియన్ రత్నాలు
- రోమ్నుంచి వచ్చిన పురాతన నాణేలు
- ఈస్టిండియా కంపెనీకి చెందిన బంగారు నాణేలు
- విలువైన రత్నాలు, బంగారంతో తయారుచేసిన విష్ణుమూర్తి విగ్రహం
- బంగారు గింజలు
- బంగారు పతకాలు
- బంగారు రాజదండాలు
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బయటపడిన అపార సంపదను జాగ్రత్త చేయాలని తాము భావిస్తున్నా, తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకే వదిలిపెడుతున్నట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వంతో పాటు చాలామంది ప్రజలు, హిందూ సంస్థలు కూడా ఈ అపార సంపదను ఆలయంలోనే ఉంచాలని భావిస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మంత్రివర్గ సమావేశానంతరం మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భద్రత తాత్కాలికమని, ఆలయ సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఆధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన శాశ్వత భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు. అయితే, ఇది భక్తుల దర్శనానికి ఏమాత్రం ఆటంకం కాబోదన్నారు. ఈ ఏర్పాట్లకు కోర్టు ఆమోదం కూడా కావాల్సి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications